18, మార్చి 2018, ఆదివారం

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?


జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లికట్టు ఆట నిషేధానికి కేంద్ర స్థాయిలో నిషేదాజ్ఞలు జారీ అయ్యాయి.  పర్యవసానం ఏమయ్యింది..?  తమిళ ప్రజలంతా  ఒక్కటయ్యారు.  చంటి పిల్లలు మొదలుకొని సెలబ్రిటీల వరకు, సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు అందరూ ఏకమయ్యారు.  తమ సంప్రదాయ క్రీడ పై నిషేధం విధిస్తే..  అది తమ సంస్కృతి, సంప్రదాయాల మీద జరిగిన దాడిగానే భావించవలసి వుంటుందని అంతాకలసి రాష్ట్రాన్నే స్థంబింపజేసారు.  ఎంతో ప్రభావ వంతమైన జీవ కారుణ్య పరిరక్షణ సంస్థలు,  న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు  ఈ వుద్యమాన్ని పరిగణనలోకి  తీసుకొని తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.   తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలిగినా తాము కుల, మత, వర్గ, లింగ భేధలు లేకుండా అంతా ఒక్క తాటి పై నిలబడి ఎంత తీవ్రంగా స్పందిస్తారో కేంద్రానికి  తెలియచెప్పారు.  కేంద్రం మెడలు వంచి, వున్న చట్టాలను సవరించి, అనువైన ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టేలా చేసి,  జల్లికట్టు కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం ద్వారా పై చేయి సాధించారు తమిళ ప్రజలు.   ఒక సంప్రదాయ క్రీడ విషయమై రేగిన అలజడికి తక్షణమే స్పందించి,  పరిస్థితులు చేయి దాటిపోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకున్న కేంద్రం -  అసహాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యవసర ఆక్సిజన్ లాంటి "ప్రత్యేక హోదా"  పై ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తుంది..?  నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఇందులో కేంద్రం తప్పేమీ లేదు.  మన ప్రక్క రాష్ట్రం ఒక ఆట కోసం అంతగా తెగువ చూపించి సాధించుకుంటే,  రాష్ట్ర జీవనాధార హక్కు సాధించుకోవడానికి పార్టీలు గాని,   ప్రజానీకంగాని ఆ స్తాయిలో స్పందించలేదు అన్నది వాస్తవం.  ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే  అధికార, ప్రధాన పార్టీ  తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వుండి కూడా ప్రత్యేక హోదా పై గట్టిగా నిలదీయలేక పోయింది.   ఇన్నాళ్ళ అన్యోన్య దాంపత్యం అనంతరం ప్రజాగ్రహాన్ని గుర్తించి రాజకీయ విడాకులు తీసుకొని,   ఒప్పంద బంధాన్ని గౌరవించి ఈ పాపాలను భరించాను గాని,   తప్పంతా బిజెపి దే అని తన రాజకీయ విధానాన్ని సమర్ధించుకో చూస్తుంది.   ప్రత్యేక హోదా సాధ్యపడే విషయం కాదని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే  కేంద్రం తేల్చి చెప్పినా, ఇన్నాళ్ళు కలసి కొనసాగడం తమ తప్పిదమేనని చంద్రబాబు ఒప్పుకొని వుంటే ఎంతో హుందాగా వుండేది.   ఇక ప్రధాన ప్రతిపక్షం వై యస్ ఆర్ సి పి మొదటి నుండి ప్రత్యేక హోదా పై గళం విప్పుతున్నా..   అది "అశ్వత్థామ అతహ్ కుంజరహ"   రీతిలోనే కొనసాగిస్తు వస్తున్నారు.   గట్టిగా నినదిస్తే ఇప్పుడిప్పుడే స్నేహ హస్తాన్ని చాస్తున్న మోడీ చెయ్యిస్తారేమో అన్న సంశయం కారణం కావొచ్చు.  ప్రత్యేక హోదా ఇతర విభజన హామీలు అమలుకు భరోసా ఇచ్చింది  టిడిపి - బిజెపి ద్వయమే కాబట్టి,  అవి అమలులో విఫలమైతే ప్రజలలో చులకన అయ్యేది వారే కదా..!  అది మా పార్టీకి లాభమే కదా..!   అన్న విధానంలోనే జగన్ ఆలోచిస్తూ వస్తున్నారు.   అంతే తప్ప "ప్రత్యేక హోదా" వంటి వజ్రాయుధాన్ని నాలుగేళ్ళుగా నిరుపయోగంగా ఒరలో పెట్టుకు తిరుగుతున్నానన్న విషయాన్ని విస్మరించారు.   అవసరమైతే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్ ఎప్పుడో ప్రకటించారు.   ఆనాడే ఆ పని చేసి వుంటే ఈనాడు రాష్ట్రంలో జగన్ ఒక ప్రభంజనమై నిలిచే వారు. పదవీకాలం ముగుస్తున్న ఈ తరుణంలో రాజీనామాలు చేయించినా అంత ప్రాధాన్యం ఏముంటుంది..?   ఇక జనసేన ది కూడా ఇలాంటి తంతే.   పవన్ షూటింగ్ విరామ సమయాలలో అడపదడపా సభలు పెట్టి,  ప్రత్యేక హోదా పై ప్రజలు వుద్యమించాలని వుద్భోధించడమే గాని,   ప్రత్యక్ష కార్యచరణ కార్యక్రమాలు చేపట్ట లేదు.  ఒక ప్రక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ..  రెండిటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక పవన్ ఈ నాలుగేళ్ళు సతమత మయ్యారు.   ఇప్పటి నుండి పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయించడానికి నిశ్చయించుకున్నా,  రాష్ట్రం కోసం వుద్యమించే చాలా విలువైన కాలాన్ని  ఆయన   కోల్పోయారు. మేము అధికారం లోకి వస్తే "ప్రత్యేక హోదా" ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నెత్తి,  నోరు కొట్టుకున్నా  ఆంధ్ర ప్రజలు వారిని ఇప్పటికీ అనుమానాస్పదంగానే చూస్తున్నారు.   రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గత నాలుగేళ్ళుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నది   "ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి"   మాత్రమే కనిపిస్తున్నది.   సమైఖ్యాంధ్ర వుద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్,  మరికొంత మంది వివిధ రంగాలకు చెందిన పెద్దలు నిరంతర పోరాటం చేస్తున్నారు.   ప్రధాన రాజకీయ పార్టీలు, మీడియ  నుండి తగిన సహకారం, ప్రోత్సాహం లభించకపోవడంతో వారి శ్రమ తగిన గుర్తింపుకు నోచుకోబడలేదు.    ప్రత్యేక హోదా విషయమై  పార్టీలన్నీ తమ జెండాలను ప్రక్కన పెట్టి,   ఒకటే అజెండాతో  పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఎప్పటినుండో చెపుతున్నా  ఈ పార్టీల చెవికెక్కలేదు.   ఇప్పటికైనా పార్టీలు అన్నీ (బిజెపి తప్పించి)  ప్రత్యేక హోదాపై తీవ్ర స్థాయి వుద్యమానికి సిద్దమవుతుండడం శుభపరిణామం.   కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేలా వుద్యమించాల్సిన భాద్యత ఆంధ్ర ప్రజల భుజస్కంధాలపైనే వుంది. 
   

11, మార్చి 2018, ఆదివారం

"మాతృదేవోభవ"...హాలంతా శోక వెల్లువ

అది 1992-93 కాలం.  అత్తెసరు చదువుతో.. అద్భుత భవిష్యత్ కోసం.. ఆరాటపడుతూ...   ఆప్త మితృడు భయ్యా( మా ఇంటి అనధికార దత్తపుత్రుడు)తో జీవనపోరాటం ప్రారంభించిన కాలం.  ఇరవయ్యేళ్ళు మించని ప్రాయంలో ఒక వైపు చేతులు కాల్చుకుంటూ ... అప్పుడప్పుడు కడుపు కాల్చుకుంటూ..  ఎక్కువగా కాళ్ళీడ్చుకుంటూ  విశాఖ మహానగరాన్ని అపురూపంగా చూస్తూ గడిపేస్తున్న అందమైన, అమూల్యమైన రోజులు.  మేము ఏపాట్లు పడుతున్నామో (సహజ బ్యాచిలర్ కోతి చేష్టలు అలవడ్డాయేమో కనుక్కుందామన్న మిష కూడా కావచ్చు) అని కొత్తలో ఒకసారి నాన్న వచ్చారు.   ఇంటిగల వారు, ఇతర పక్క కుటుంబాల వారు మాపై మంచి అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో నాన్న సంతోషపడ్డారు.  ఆయనకు, మాకు కొద్దిగా సినిమా పిచ్చి వుండడంతో ఒక ఆధివారం జగదాంబ థియేటర్ కు తీసుకువెళ్ళాం.   దానిలో అప్పటి నలుగురు అగ్ర కథానాయకులలో ఒకరి చిత్రం నడుస్తున్న గుర్తు.  టిక్కెట్స్ అయిపోవడంతో  బ్లాక్ లో ఒక టికెట్ సంపాదించి ఆయనను పంపించాం. ఆయన వచ్చేవరకు వుండాల్సిందే కదా అని చుట్టుపక్కల థియేటర్స్ చూస్తే ఒక దానిలో (వెంకటేశ్వర థియేటర్ అని గుర్తు) "మాతృదేవోభవ"  ఆడుతుంది.   నాజర్, మాధవి హీరో, హీరోయిన్స్.  అంత ఆసక్తి లేకున్నా ఏదో కాలక్షేపం చేయాలన్న వుద్దేశ్యంతో టికెట్స్ తీసుకొని వెళ్ళికూర్చున్నాము.   సినిమా ప్రారంభమయ్యే సమయానికి థియేటర్ ఫుల్ అయిపోయింది.   75 శాతం మహిళా ప్రేక్షకులే వున్నారు.   సినిమా మొదలైన కొద్ది సేపటికే మహిళలు ఏడుస్తుండడం చూసి "భలే సినిమాకు వచ్చాములే" అని నవ్వుకున్నాము.  ఇంటెర్వల్ కు చూస్తే ఆడవాళ్ళకన్నా మా మితృలిరువురమే ఎక్కువగా ఏడ్చినట్టు గమనించాం . సినిమా అయిపోయిన తరువాత, నీళ్ళతో ముఖం కడుక్కొని బయటకు వచ్చినట్టు బాగా గుర్తు.  నాజర్, మాధవి, తనికెళ్ళ భరణి అద్భుతంగా నటించారు.  మరీ ముఖ్యంగా మాధవి, ఆమె పిల్లలుగా నటించిన బాల నటులు ఆ పాత్రలలో జీవించారు. " రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే", "వేణువై వచ్చాను భువనానికి" ఈ రెండు పాటలు ఎప్పుడు విన్నా గుండెల్లో ఏదో తెలియని బాధ వెలుపలకు వస్తుంది.  వూహ తెలిసిన తరువాత ఇంతగా ఏడ్పించిన చిత్రం మరొకటి లేదు.  ఈ సినిమా చాలా అవార్డ్స్ పొందడంతో పాటు, కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ ను సాధించింది.  ఈ చిత్రం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాటి సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటాము.   

8, మార్చి 2018, గురువారం

కాంగ్రెస్ తప్పిదాల బాటలోనే బి.జె.పి అడుగులు..?

     దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ కు కూడా సాధ్యంకాని రీతిలో బిజెపి నేడు అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ప్రణాళికలు రచించి ఈశాన్య రాష్ట్రాలలో కూడా పాగా వేసి భారత రాజకీయాలలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.  ఎటొచ్చి దక్షిణాదిలోనే బిజెపికి గండిపడుతుంది.  కర్నాటక తప్పించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సొంతంగా అధికారంలోకి కాదుకదా వునికి కాపాడుకోవడానికే శ్రమించాల్సిన గడ్డు పరిస్థితి.  నాటి సమైఖ్యాంధ్రప్రదేశ్ లోను, నేటి నూతన నూతన ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం పొందింది.  ప్రత్యేక హోదా తో పాటుగా ఇతర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమయ్యిందన్న కారణం సాకుగా చూపి టిడిపి తనంత తానుగా తెగతెంపులు చేసుకోవడంతో,  దక్షిణాదిలో బిజెపికి వున్న ఒక్క అధికార ఆధారం  కూడా నేడు దూరం అయిపోయింది.  నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక,  ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోవడంతో తలపట్టుకొని కూర్చున్నారు. నేడు భారత రాజకీయాలలో బాహుబలిలా కీర్తించబడుతున్న  మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయమై కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తున్నది ప్రస్తుత రాజకీయ వాతావరణం.  కాంగ్రెస్ పతనం ఖాయమని నిర్ధారణ చేసుకొని, అప్పటి వరకు పార్టీలో కీలక భాద్యతలు నెరవేర్చిన పెద్ద తలకాయలు కొన్ని బిజెపిలోకి చప్పున దూకి తమ రాజకీయ పలుకుబడికి ఢోకా లేకుండా చూసుకున్నారు.  ప్రజలలో వారిపట్ల వున్న వ్యతిరేకత కొంతవరకు తగ్గిన తరువాత,  నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభావితం చేసినట్లే బిజెపి అధిష్టానాన్ని ప్రభావితం చేయడం మొదలెట్టారని విశ్లేషకులు అంటున్నారు. స్వతహాగ మొదటి నుండి తెలుగుదేశంతో బద్దశతృత్వం కలిగి వున్న వీరు నెమ్మదిగా మోడీ-బాబుల మద్య నిప్పు రాజేసి, నేటి మంటలలో చలికాచుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.  కేంద్రం పెద్ద ఎత్తున సహాయం చేస్తే అది టిడిపి ఇమేజ్ పెరగడానికి దొహదపడుతుంది తప్ప బిజెపికి ఏ మాత్రం ప్రయోజనం వుండదని,  రాష్ట్రంలొ ఏ పార్టీ అధికారంలో వున్నా బిజెపి ప్రసన్నం కోసం ప్రాకులాడాల్సిందే అన్న పెద్దల మాట విని  మోడీ నెమ్మదిగా సహాయ నిరాకరణ చేసినట్లు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ముందునుంచి బిజెపి సానుకూలత ప్రదర్శితుండడంతో బిజెపికి మరింత దన్ను వచినట్లైంది. నాడు లక్ష్మీ పార్వతి వ్యవహారం ముదిరినంత వరకు వేచివుండి, ప్రజలలోను, పార్టీ వర్గంలోను అధికారం ఎన్ టి ఆర్ వద్దనుండి చంద్ర బాబు చేపడితేనే బావుంటుంది అన్న అభిప్రాయం వచ్చేలా చేసి తన రాజకీయ చతురతను ప్రదర్శించిన బాబు నేడు మళ్ళీ తన చాణక్యాన్ని ప్రదర్శించారు.  ప్రత్యేక హోదా ఇతర అంశాలు సఫలత సాధించలేకపోవడంలో టిడిపి-బిజెపిలకు సమాన భాద్యత వున్నప్పటికి నేడు ఆ పాపం మొత్తం బిజెపి కే అంటగట్టడంలో కృతకృత్యుడయ్యారని చెప్పక తప్పదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్తితికిలాగ   బిజెపిని తీసుకు వచ్చి  ఏకాకిని చేస్తునారు.  ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తుండడం,  పాదయాత్ర విజయవంతంగా సాగుతూ మైలేజ్ పెంచుకుంటున్న జగన్ కోరి కోరి ఇప్పుడు బిజెపి పొత్తు కొరివి కొని తెచ్చుకొనే సాహసం చేయడు.  ఇప్పటికైనా బిజెపి అధిష్ఠానం కళ్ళు తెరచి ఎపికి సాయమందించకుంటే 2014 లో కాంగ్రెస్ కు జరిగిన పరాభవమే పునరావృతం అయ్యే అవకాశాలు కమలానికి పుష్కలంగా కనిపిస్తున్నాయి.  గతంలో ఎన్నడూ లేనంత బలీయంగా వున్న బిజెపి కి  తెలుగు రాష్ట్రాలలో ఎదురుగాలి పెద్ద విషయం కాకపోవచ్చు కాని, ఆ మహా సామ్రాజ్యపు కోటలకి బీటలు పడే బీజం ఇక్కడే కావొచ్చు.   

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...